నవతెలంగాణ – హైదరాబాద్
సెన్సార్ బోర్డుపై తమిళ్ హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. సినిమాలకు సెన్సార్ ఇచ్చే సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలోనూ అవినీతి పేరుకుపోయిందని అన్నారు. తన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోని’ విషయంలో తనకు ఎదురైన సంఘటన గురించి చెబుతూ తాజాగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.‘‘అవినీతి గురించి తెరపై చూడడం ఓకేగానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని విశాల్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా ఉందని.. ముంబయి సెన్సార్ ఆఫీస్లోనూ ఇది జరుగుతోందని చెప్పారు. తన ‘మార్క్ ఆంటోని’ సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ పనులు పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులకు రూ. 6.5 లక్షలిచ్చానని.. (స్క్రీనింగ్ కోసం రూ. 3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ. 3 లక్షలు). తన కెరీర్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వాపోయారు. మరో దారిలేక డబ్బులివ్వాల్సి వచ్చిందని.. తనకే కాదు భవిష్యత్తులో ఏ నిర్మాతకూ ఇలా జరగకూడదని అన్నారు. ఎవరెవరికి డబ్బులు పంపించారో వారి పేరు, బ్యాంక్ ఖాతా వివరాలనూ పోస్ట్లో పెట్టారు.