నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లోని ఫిలిమ్ నగర్లో భారీ మొత్తంలో డ్రగ్స్ను పట్టుకున్నారు. బెంగళూరు కేంద్రంగా డేవిడ్సన్ అనే నైజీరియన్ ఈ డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, అతడిని అరెస్ట్ చేశారు. ఆల్ ఇండియా నైజీరియన్ వెల్ఫేర్ చైర్మన్గా డేవిడ్సన్ ఉన్నాడు. వేల్ఫేర్ ముసుగులో డ్రగ్స్ దందా చేస్తున్నాడు. నకిలీ పాస్పోర్టు, వీసాతో ఇక్కడ నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తప్పుడు సిమ్ కార్డులను వినియోగిస్తున్నాడని తెలింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. అత్యాధునిక కార్లలో గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇందులో ఫిలిమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న డేవిడ్సన్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇతని వద్ద రూ.11 లక్షల విలువ చేసే ఎండీఎంఏను సీజ్ చేసినట్లు తెలిపారు.