నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఐదు నెలలుగా ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు, సుధ దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో నాగరాజు.. కత్తితో భార్య సుధ గొంతుకోసి హత్య చేశాడు. తల్లిని చంపుతుండగా అడ్డొచ్చిన పెద్ద కుమారుడు దీక్షిత్నూ(8) హత్య చేసేందుకు నాగరాజు ప్రయత్నించగా.. బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. భార్యను హత్య చేసిన అనంతరం నాగరాజు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతుల మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాధగా మిగిలారు.