నవతెలంగాణ – బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, హావేరి, చిక్కమగళూరు, తదితర జిల్లాల్లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. శివమొగ్గ జిల్లా గాజనూరులోని తుంగా రిజర్వాయర్ గరిష్ట నీటి ప్రమాణానికి చేరుకుంది. తుంగతోపాటు భద్రా, లింగనమక్కి, మాణి తదితర రిజర్వాయర్లలోకి ఇన్ఫ్లో అధికంగా ఉందని అధికారులు గురువారం మీడియాకు వెల్లడించారు. కొడగు జిల్లా హారంగి రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో 3,500 క్యూసెక్కులుగా ఉంది. ఈ రిజర్వాయర్ గరిష్ట నీటి ప్రమాణం 2,859 అడుగులు కాగా ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి ప్రమాణం 2,824 అడగులుగా ఉందన్నారు. కాగా ఉడుపి జిల్లాలోని పడువరిలో అత్యధికంగా 22.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లాలోని యడ్తరె, రంజాళ, శిరూరులలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణకన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ తదితర జిల్లాలు భారీ వర్షాలతో అట్టుడుకుతున్నాయి.