– ఇండ్ల స్థలాలకు పట్టాలివ్వాల్సిందే
– భూకబ్జాదారులు, గుండాలను తరిమికొడతాం
– భూపాలపల్లి, హన్మకొండ జిల్లాల్లోని భూపోరాట కేంద్రాల్లో.. : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య
నవతెలంగాణ-భూపాలపల్లి/ హనుమకొండ చౌరస్తా
పేదల ఇండ్ల స్థలాలకు పట్టాలు, ఇండ్లు కట్టించి ఇవ్వాల్సిందేనని, భూకబ్జాదారులు, గుండాలను తరమికొట్టి వారి సమస్యలు పరిష్కరించేవరకూ పేదోళ్లకు ఎర్రజెండా అండగా ఉంటుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య తెలిపారు. జయశంకర్-భూపాలపల్లి, హన్మకొండ జిల్లాలో పేదలు వేసుకున్న గుడిసె ప్రాంతాలను మంగళవారం ఆయన సందర్శించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువులోని సర్వేనెంబర్-280, 282, 283, 284, 285లో పేదలు వేసుకున్న గుడిసెల ప్రాంతాన్ని సందర్శించిన అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు, రాష్ట్రవ్యాప్తంగా 66 కేంద్రాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెల పోరాటం కొనసాగుతుందన్నారు. వరంగల్ జిల్లాలోని జక్కలొద్ది భూ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు 58, 59 జీవో ప్రకారం ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతేడాదిగా ప్రజలు ఎండనక, వాననక కారు చీకట్లో కూడా ఎన్నో కష్టాలనోర్చుకుని గుడిసెలల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం సర్వే చేసి ఇండ్లు లేని పేదలకు ఇండ్లు నిర్మించి వారికి అండగా నిలిచిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో గుడిసెలు వేసుకున్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.10 లక్షలు.. మొత్తం రూ.15లక్షలు.. ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని కోరారు. లేదంటే ప్రజలను సమీకరించి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకూ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
హన్మకొండ జిల్లా గోపాల్పూర్ భూ పోరాట కేంద్రంలో హన్మకొండ పశ్చిమ మండల కార్యదర్శి వంకుడోత్ వీరన్న నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సభలో వీరయ్య మాట్లాడారు. 21 ఎకరాల గోపాల్పూర్ చెరువులో 14 ఎకరాలు కబ్జాకు గురికాగా మిగిలిన 7 ఎకరాల భూమిలో పేదలు గుడిసెలు వేసుకుంటే జేసీబీలతో కూల్చి వేస్తూ వారి కడుపుకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 56వ డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్.. ఎక్కడ ఖాళీ జాగాలు కనబడితే వాటిని కబ్జా చేయడం తన పని అని, ఇప్పటికైనా కార్పొరేటర్ ఆగడాలను స్థానిక ఎమ్మెల్యే కట్టడి చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిం చారు. వచ్చే ఎన్నికల కోసం మన దగ్గర కొచ్చే బీజేపీ, బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు మన ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఇండ్ల పట్టాలిచ్చేంతవరకు ఐక్యంగా పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశాల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు, హన్మకొండ జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి, భూపాలపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోలం రాజేందర్, జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య, రజినీకాంత్, గుర్రం దేవేందర్, ఆత్కూరి శ్రీకాంత్, హన్మకొండ పశ్చిమ మండల కమిటీ సభ్యులు కే.రవీందర్, బోట్ల స్వామిదాస్, వి.రాజు, ప్రజా సంఘాల నాయకులు, గుడిసె వాసులు తదితరులు పాల్గొన్నారు.
పేదల గుడిసెల జోలికి వస్తే ఖబర్దార్
2:45 am