నవతెలంగాణ -హైదరాబాద్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు వీలుగా శాసనసభ్యుడిగా తన ఎన్నిక చెల్లదన్న తీర్పుపై స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వర్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ను వేశారు. వనమా విజ్ఞప్తిని తాజాగా హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు మధ్యంతర తీర్పును కొట్టివేసింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ ఈనెల 25వ తేదీన హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కొత్తగూడెం శాసనసభ్యుడిగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ఈ తీర్పును సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ నిన్న వనమా వెంకటేశ్వరరావు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం వనమా విజ్ఞప్తిని నిరాకరించింది. వనమా తన భార్య పార్వతి పేరిట పాల్వంచలోని 992/2 సర్వే నంబర్లో ఉన్న 8.37 ఎకరాలతోపాటు సంస్థాన్లోని 122/2 సర్వే నంబర్లో ఉన్న 1.33 ఎకరాల ఆస్తి గురించి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని తేల్చింది. ఈ భూములకు ఆయన ప్రభుత్వం నుంచి రైతు బంధు పథకం ద్వారా సాయం పొందినట్టు గుర్తించింది. పాల్వంచలో 300 గజాల్లోని ఇంటి గురించి 2004, 2009, 2014 ఎన్నికల అఫిడవిట్లల్లో పేర్కొన్న వనమా.. 2018 ఎన్నికల అఫిడవిట్లో దాని ప్రస్తావన కూడా చేయలేదని తప్పుపట్టింది. అందుకే వనమా ఎన్నికను రద్దు చేస్తున్నామని వెల్లడించిన హైకోర్టు.. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి పిటిషనర్ జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా కొనసాగుతారని ప్రకటించింది.