– రూ.10 లక్షలు దాటితే ఐటీ పరిధిలోకి…
– అంతకంటే తక్కువుంటే జిల్లా ఎన్నికల అధికారి పరిధి : ఐటీశాఖ డీజీ సంజయ్ బహదూర్ వివరణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలించే నగదు, బంగారం, వజ్రాలు తదితరాలపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) ప్రత్యేక దృష్టి సారిస్తుందని హైదరాబాద్ శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహదూర్ తెలిపారు. దీనికోసం 250 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తనిఖీల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో పట్టుబడితేనే ఆదాయపన్ను శాఖ పరిధిలోకి వస్తుందనీ, అంతకంటే తక్కువ సొమ్ము అయితే జిల్లా ఎన్నికల అధికారి పరిధిలో ఉంటుందని వివరణ ఇచ్చారు. బ్యాంకుల్లో ఏకమొత్తంలో డిపాజిట్లు, విత్డ్రాలపై తమ శాఖ ఇంటలిజెన్స్ విభాగం నిఘా ఉంటుందని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.20 కోట్లు స్వాధీనం చేసుకున్నామనీ, ఆయా కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని బుధవారంనాడిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు, ఎయిర్పోర్ట్ అథారిటీతో పాటు వివిధ శాఖలు అందించిన సమాచారంతో రూ.53.93 కోట్లు సీజ్ చేశామనీ, దానిలో 10.99 కోట్లు సరైన కారణాలు చూపడంతో రిలీజ్ చేశామని చెప్పారు. ఎన్నికల అఫిడవిట్లలో అభ్యర్థుల ఐటీ రిటర్న్స్తో పాటు ఎన్నికలు ముగిసాక ఆరు నెలల లోపు సమర్పించే ఖర్చుల వివరాలను సైతం తమ శాఖ మదింపు చేస్తుందని తెలిపారు. తమ శాఖ స్వయంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటి వరకు 1.76 కోట్లు సీజ్ చేశామన్నారు. ఎన్నికల్లో నగదు రవాణా, బదిలీని నివారించేందుకు, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రత్యేక యాప్ ద్వారా సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలికి చేరేందుకు క్విక్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎయిర్పోర్టు తనిఖీల్లో భాగంగా ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్స్ (ఏఐయూ) ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లోని అయ్యకార్ భవన్ ఆదాయపన్ను శాఖ కార్యాలయం మొదటి అంతస్తులో 24/7 పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామనీ, ఎన్నికల్లో డబ్బు, అభరణాలు, బంగారం, వెండి, వజ్రాల వినియోగం గురించి సమాచారం ఉంటే ప్రజలు ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. దానితోపాటు టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-1788 లేదా ల్యాండ్లైన్ నెంబర్లు 040-23426201/23426202కు ఫోన్ చేసి సమాచారం తెలుపవచ్చన్నారు. అలాగే వీడియోలు ఇతర సమాచారం ఉంటే 7013711399 నెంబర్కు వాట్సప్ చేయాలనీ, ఇతర ఫిర్యాదులను cleantelanganaelections@incometax.gov.in కు మెయిల్ చేయోచ్చని చెప్పారు. సమావేశంలో ఆదాయపన్ను శాఖ హైదరాబాద్ విభాగం అడిషనల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్), ఎన్నికల నోడల్ ఆఫీసర్ ఎమ్ కార్తిక్ మాణిక్కం, అడిషనల్ డైరెక్టర్ (హెడ్క్వార్టర్స్) జీ రాఘవేంద్రరావు, పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతిపాటిల్ పాల్గొన్నారు.