నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్ సహా మిగిలిన చోట్ల ముసురు పట్టుకుంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద చేరుతుండడంతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరంగల్ సిటీలో నాలాలు పొంగి పొర్లి సాయిగణేశ్ కాలనీ, వివేకానంద కాలనీ, ఎస్ఆర్ నగర్ జలమయమయ్యాయి. భద్రాచలం–పేరూరు మార్గంలో నల్లబెల్లి గ్రామం వద్ద భారీ చెట్టు నేలకొరిగి, కొన్ని గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. సిరిసిల్ల, వేములవాడ పట్ణణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ రోడ్ పై నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది. కామారెడ్డి జిల్లా లింగంపేట, గాంధారి మధ్య రామలక్ష్మణ్పల్లి మత్తడివాగు బ్రిడ్జి దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వరదలో కొట్టుకుపోయింది. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. రామలక్ష్మణ్పల్లి గ్రామానికి చెందిన 60 మంది స్టూడెంట్లు స్కూలుకు వెళ్లలేకపోయారు. ఎడతెరిపిలేని వానలతో కోల్బెల్ట్ వ్యాప్తంగా ఓసీ గనుల్లో దాదాపు 1.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, దాదాపు 22.53 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ పనులు ఆగిపోయాయి.