నవతెలంగాణ – కామారెడ్డి
మేతకు వెళ్లిన 190 పశువులు ఇంటికి తిరిగొచ్చే క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తాడ్వాయి మండలంలోని సంతాయిపేటకు చెందిన పశువులను ఇద్దరు వ్యక్తులు గురువారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం తిరిగి తీసుకెళ్లేందుకు భీమేశ్వరవాగు దాటిస్తుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో ఒడ్డుకు చేరలేక జీవాలన్నీ కొట్టుకుపోయాయి. కొంత దూరం తరువాత 20 పశువులు గాయాలతో బయటపడ్డాయి. విషయం తెలిసి గ్రామస్థులంతా వాగు వద్దకు చేరి గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి పది గంటల వరకు మరో 80 పశువులను రక్షించారు. మిగతా వాటి కోసం తాడ్వాయి పోలీసులు, కామారెడ్డి అగ్నిమాపక సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ఒక్కసారిగా వరద వచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.