నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మాటల పదును చూపెట్టారు. తన మార్కు పంచ్ డైలాగ్ తో ప్రతిపక్షాలను హెచ్చరించారు. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. కొందరు హైదరాబాద్లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడిందని చెప్పారు. కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా మళ్లీ ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ‘సినిమా అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డులో చూసేది కాదు. ప్రతిపక్షాలకు చూపించే సినిమా 2023లోనే ఉంది. గత తొమ్మిదేళ్లలో చూపింది ట్రైలర్ మాత్రమే’అని పేర్కొన్నారు.