నవతెలంగాణ-హైదరాబాద్ : జనసేనాని పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య చెప్పుల పంచాయితీ ఇప్పట్లో ముగిసేట్టు లేదు. తనను ప్యాకేజి స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతానని పవన్ కల్యాణ్ గతంలో పలు మార్లు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కూడా చెప్పు చూపించి మక్కెలిరగ్గొడతానంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. అందుకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందిస్తూ, పవన్ కే కాదు మాక్కూడా చెప్పులు ఉన్నాయి అంటూ రెండు చెప్పులూ చూపించారు. దాంతో, పవన్ నిన్న పిఠాపురం సభలో, తన రెండు చెప్పులు ఎవరో కొట్టేశారంటూ సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలో, పేర్ని నాని మరోసారి స్పందించారు. “చెప్పులు పోయాయని పవన్ కల్యాణ్ ఆందోళన చెందుతున్నట్టుంది. అయినా, చెప్పులు పోయిన సంగతి మూడ్రోజుల తర్వాత గుర్తొచ్చిందా…? సరే చెప్పులు పోతే ఎవరో ఒక నిర్మాత కొనిస్తారు… కానీ ఆయన పార్టీకి ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు పోయింది కదా… ముందు ఆ గాజు గ్లాసు గుర్తు ఎక్కడుందో వెతుక్కోమనండి” అంటూ ఎద్దేవా చేశారు.