నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మండలంలోని మాల మహానాడు నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు శ్రీకాంత్ అబ్బోల్ల, మండల ఉపాధ్యక్షులు గైని కిరణ్ లు మాట్లాడుతూ శనివారం హైదరాబాదులో జరిగిన విశ్వరూప మహాసభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ చేపడతానని దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం వెంటనే మానుకోవాలని వారు సూచించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టు వేసిన అంశాన్ని వారు గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ చేపడతామన్న చంద్రబాబు నాయుడు రాజకీయంగా భూస్థాపితం చేశామని, బీజేపీ ప్రభుత్వం సైతం ఈ అంశంపై ఏలాంటి నిర్ణయం తీసుకున్న రాబోవు ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కల సంతోష్, యూత్ జిల్లా ఉపాధ్యక్షులు గైని కిరణ్, డివిజన్ నాయకులు సిద్ధ సాయిలు, రాందాస్, లోక కృష్ణ, డైరీ సాయిలు, సిద్ధ పోశెట్టి, ఎల్ గంగాధర్, పోశెట్టి, దేవేందర్, ప్రకాష్, రమేష్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.