నవతెలంగాణ – ఉత్తరాఖండ్
ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో వెలసిన కేదార్ నాథ్ ధామ్ ఎంతో పవిత్రమైనది. గత కొన్ని రోజులుగా కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా పవిత్ర కేదార్ నాథ్ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ భక్తురాలు కరెన్సీ నోట్లు వెదజల్లడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది. అయితే సదరు మహిళ ఎవరన్నది తెలియరాలేదు. వీడియోలో ఏముందంటే..? ఆలయ గర్భగుడిలోని శివలింగానికి పక్కనే నిలబడి ఉన్న మహిళ కేదారేశ్వరుడిపై కరెన్సీ నోట్లు వెదజల్లింది. ఆ సమయంలో గర్భగుడిలో కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఆలయ పురోహితులు మంత్రాలు పఠిస్తూ కనిపించారు. మహిళ అనుచితంగా ప్రవర్తిస్తున్నా అక్కడున్న వారు అడ్డుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, పవిత్ర కేదార్ నాథ్ ఆలయ గర్భగుడిలో వీడియోలు, ఫొటోలు తీయడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఈ వీడియో బయటకు రావడంపై శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తాజా ఘటనపై ఆలయ కమిటీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన సదరు మహిళపై విచారణ జరిపించాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును కోరారు.