నవతెలంగాణ అచ్చంపేట: అచ్చంపేట న్యూటౌన్ లో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనాన్ని ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గేట్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆపకపోవటంతో వాహనాన్ని వెంబడించారు. అచ్చంపేట పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో అడ్డుకొని వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు వేసుకోగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. అనంతరం ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. వాహనంపై దాడి సరికాదని బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి చేశారంటూ పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. స్వల్ప గాయాలైన ఎమ్మెల్యే బాలరాజుకు అచ్చం పేటలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు.