నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల సంఖ్య మరో 94 వేలకుపైగా పెరిగింది. అక్టోబర్ 4వ తేదీన తుది జాబితా ప్రకటించగా.. 5 నుంచి అక్టోబర్ 31 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వ విభాగాలు అర్హత ఉన్నవి ఆమోదించాయి. ఓటర్ల అనుబంధ జాబితా వివరాలను బుధవారం వెల్లడించారు. తుది జాబితా ప్రకారం జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 44,42,458 ఓటర్లున్నారు. అనుబంధ జాబితాలో ఆ సంఖ్య 45,37,256కు పెరిగింది. అంటే 94,798 మంది కొత్త ఓటర్ల పేర్లు జాబితాలో చేరాయి. ఇందులో పురుషులు 23,22,990, మహిళలు 22,13,939 థర్డ్ జెండర్ 327 ఉన్నారు. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.85 లక్షలకుపైగా, అత్యల్పంగా చార్మినార్లో 2.26 లక్షలకుపైగా ఓటర్లున్నారు. ఎన్నికలున్న నేపథ్యంలో ఓటరు నమోదుపై పౌరులతోపాటు.. రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. తుది జాబితా విడుదల అనంతరం 1.20 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో అనుబంధ జాబితాలో ఓటర్ల సంఖ్య పెరగడం ఇదే ప్రథమమని జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. షెడ్యూల్ విడుదల కావడం.. ఖరారైన అభ్యర్థులతోపాటు ఆశావహులూ ఓటర్ నమోదుకు ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం ఓటర్లలో 18-19 యేళ్ల వయసున్న ఓటర్లు 84705గా ఉన్నారు. 40 యేళ్లలోపున్న ఓటర్లు 50 శాతానికిపైగా ఉండడం గమనార్హం.
నియోజకవర్గం మొత్తం
ముషీరాబాద్ 3,01,811
మలక్పేట 3,17,875
అంబర్పేట 2,77,125
ఖైరతాబాద్ 2,96,036
జూబ్లీహిల్స్ 3,85,287
సనత్నగర్ 2,49,032
నాంపల్లి 33,2791
కార్వాన్ 3,59,485
గోషామహల్ 2,70,633
చార్మినార్ 2,26,126
చాంద్రాయణగుట్ట 3,37,912
యాకుత్పురా 3,53,141
బహదూర్పురా 3,16,675
సికింద్రాబాద్ 2,62,539
కంటోన్మెంట్ 2,50,788
మొత్తం 45,37,256