నవతెలంగాణ-హైదరాబాద్ : తొలి కాన్పులో మగశిశువుకు జన్మనిచ్చిన తల్లి శిశువుకు పాలిచ్చి, నిద్రలోనే మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన బుస్సా సుస్మిత (22) ఈనెల 13న సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మగ శిశువును ప్రసవించింది. శిశువుకు శ్వాస సమస్య తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రిలోని నవజాత శిశు వార్డులో వైద్య చికిత్స చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో శిశువుకు పాలు ఇచ్చిన సుస్మిత నీళ్లు తాగి నిద్రపోయింది. ఉదయం 6 గంటల సమయంలో సుస్మిత నిద్ర నుంచి లేవలేదు. ఆమె తల్లి వైద్యులకు తెలుపగా, సుస్మిత నిద్రలోనే మృతి చెందినట్టు వైద్యులు గుర్తించారు. బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టడం వల్ల సుస్మిత మృతి చెంది ఉండవచ్చని సూపరింటెండెంట్ చెప్పారు. మృతురాలి బంధువులు సుస్మిత మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయారని, శిశువు ఆస్పత్రిలోని నవజాతశిశు వార్డులో ఉందని తెలిపారు.