నవతెలంగాణ – హైదరాబాద్: లడ్డూ వేలంలో బాలాపూర్ గణపతి లడ్డూ ఫేమస్ అన్న విషయం తెలిసిందే. దానికి పోటీగా నిలుస్తుంది.. మాదాపూర్ మై హోమ్ భూజా లడ్డూ. గత ఏడాది బాలాపూర్ లడ్డూ కంటే ఈసారి మై హోమ్ భూజాలో గణపతి లడ్డూ ఎక్కువ ధర పలకడం విశేషం. ఈసారి వేలంలో మరోసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి బుధవారం జరిగిన వేలం పాటలో గణేశుడి లడ్డూను రూ.25.5 లక్షలకు దక్కించుకున్నారు. మై హోమ్ భూజా వాసులు వేలంలో లడ్డూను దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. చివరి వరకు లడ్డూ వేలం ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి అందరికంటే ఎక్కువగా పాడి చిరంజీవి గౌడ్ గణపయ్య లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఇదే హోమ్ భూజాలో లడ్డూ రూ.20.5 లక్షలు పలకగా.. 2021లో రూ.18.50 లక్షలకు లడ్డూ అమ్ముడుపోయింది. మై హోమ్ భూజాలో ప్రతి ఏడాది వేలంలో లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది. ఇక్కడ గణేశుడి లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులను సమాజసేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. హైదరాబాద్ శివారులోని బాలాపూర్ గణేశుడి లడ్డూ గత ఏడాది రూ.24.60 లక్షలు పలికింది.