– జాతీయ పతాకాలను ఆవిష్కరించిన మంత్రులు, ప్రభుత్వ విప్లు
నవతెలంగాణ-విలేకరులు
సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన రోజుగా అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పలు జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ విప్లు పాల్గొని జాతీయ జెండాలు ఎగరవేశారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో పౌర సంబంధాలు, భూగర్భ గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి పాల్గొని పోలీసుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు.
నల్లగొండలోని పరేడ్గ్రౌండ్లో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్లో విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జెండాను ఆవిష్కరించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్రెడ్డి జెండా ఎగురవేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన, స్త్రీ – శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ములుగు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావు జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అంతాయిపలి ్లలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలో మంత్రి మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ సుంకరి రాజు, మంచిర్యాలలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.