నవతెలంగాణ-హైదరాబాద్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. వానాకాలం సీజన్లో ముందస్తు పంట సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులైనా తొలకరి ఇప్పటివరకూ పలుకరించలేదు. దీంతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి.. రైతుల కోసం ప్రత్యేక చొరవ తీసుకొని నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయించేందుకు సీఎం కేసీఆర్తో మాట్లాడారు. సోమవారం కేసీఆర్ను కలిసి నిజాంసాగర్ ఆయకట్టు కింద నారు మడులు వేసుకున్నారని, ఇక్కడ ముందస్తు సాగు చేసుకుంటారని నీటిని విడుదల చేయాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్..సాగర్ నుంచి నీటి విడుదలకు అంగీకరించారు. ఈ మేరకు బుధవారం నుంచి ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేయనున్నారు. స్పీకర్ పోచారం, జడ్పీ చైర్పర్సన్ ధపేదార్ శోభ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రధాన కాలువలోకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నా రు. ప్రాజెక్టు ఆయకట్టు కింద నిజాంసాగర్, బాన్సువాడ, బీర్కూర్, వర్ని, నస్రుల్లాబాద్, కోటగిరి, చందూర్ మండలాల్లోని రైతులు వరి నారు పోసుకున్నారు. ఆయా భూములకు వరినాట్ల కోసం సాగర్ నుంచి ప్రధాన కాలువ ద్వారా నీటిని అందించనున్నారు. నాట్లతో పాటు మూడు తడులకు సరిపడా నీరు నిజాంసాగర్లో ఉన్నందున మూడు విడుతల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.