![ఇద్దరిపై సస్పెన్షన్ వేటు](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/police-10.jpg)
నవతెలంగాణ హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఎల్బీనగర్ పీఎస్లోని హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 15న రాత్రి 11గంటలకు ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసు వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించారని, సెల్ఫోన్ లాక్కుని చిత్రహింసలకు గురి చేశారని లక్ష్మి అనే బాధితురాలు ఆరోపించింది. రాత్రంతా స్టేషన్లోనే ఉంచి లాఠీలతో కొట్టారని వాపోయింది. ఆమె శరీర భాగాలపై లాఠీలతో కొట్టినట్టుగా గాయాలు కనిపిస్తున్నాయి. నిన్న ఉదయం వరకూస్టేషన్లోనే ఉంచారని ఆమె తెలిపింది. బాధితురాలు మీర్పేట నందిహిల్స్లో నివాసం ఉంటోంది.
విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు. అయితే, ఆ ఆరోపణలు నిజం కాదని ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. ఘటనపై ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ స్పందించారు. ఘటన తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతున్నామని తెలిపారు. ‘‘ఎల్బీనగర్ కూడలిలో ముగ్గురు మహిళలు గొడవ చేశారు. గొడవపై సమాచారం రావడంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో ఈనెల 16న తెల్లవారుజామున పెట్రోలింగ్ సిబ్బంది మహిళలను పీఎస్కు తరలించారు. మహిళలపై ఐపీసీ 290 కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాం. పోలీసులు తీవ్రంగా కొట్టారని మహిళలు చెబుతున్నారు. బాధిత మహిళతో మాట్లాడాను. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని డీసీపీ సాయిశ్రీ తెలిపారు.