నవతెలంగాణ-హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. యాత్ర ప్రారంభించిన తొలిరోజే ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. పవన్ను చూసేందుకు విద్యుత్ స్థంభం ఎక్కిన ఓ వ్యక్తి పట్టు తప్పి కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్పై పడటంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మరణించాడు. వారాహి యాత్ర ఇవాళ అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజల అనంతరం ప్రారంభమైంది. జనసేన పార్టీ నేతల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పవన్ కళ్యాణ్ను చూసేందుకు జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఓ యువకుడు అత్యుత్సాహంతో అక్కడున్న లైట్ స్టాండ్ ఎక్కాడు. అయితే పట్టు తప్పడంతో కింద ఉన్న ట్రాన్స్ఫార్మర్పై పడ్డాడు. అంతే తీవ్రమైన విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడే మరణించాడు. సంఘటనా ప్రాంతాల్ని పోలీసులు పరిశీలించారు. ఆ యువకుడు ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్కు అనుకుని లైట్ స్టాండ్ అమర్చడం, లైట్ స్టాండ్ వద్ద వాలంటీర్లను రక్షణంగా ఉంచకపోవడంతో ఓ యువకుడు అత్యుత్సాహంతో ఆ లైట్ స్టాండ్ ఎక్కి కిందనున్న ట్రాన్స్ఫార్మర్పై పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారాహి యాత్ర ప్రారంభమైన తొలిరోజే ఇలా జరగడంతో జనసేన కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పవన్ కళ్యాణ్ను చూసేందుకు వచ్చేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. విద్యుత్ స్థంభాలు, గోడలు, మిద్దెలు ఎక్కవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.