నవతెలంగాణ-హైదరాబాద్ : వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తెలంగాణ సంపదను దోచుకొనేందుకు రకరకాల పార్టీల పేరుతో వస్తున్నారని .. అలాంటి వారంతా ఒకే తాను ముక్కలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అలాంటి నాయకులను నమ్మినా ,ఆ పార్టీలకు ఓట్లేసినా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. సింగరేణి బొగ్గును రాజమండ్రికి తరలిస్తామంటే ఏమి చేయలేమంటే.. షర్మిల లాంటి వారికి తెలంగాణలో ఏం పని మంత్రి ప్రశ్నించారు. ఆమెకు తెలంగాణ ఆచార వ్యవహారాల గురించి ఏం తెలుసన్నారు మంత్రి గంగుల. షర్మిల రాష్ట్రంలో పాదయాత్రలు చేయడం చూస్తుంటే గతంలో తెలంగాణ సంపదను దోచుకున్న వారి చరిత్ర, తీరు మార్చుకోలేదని నిరూపితమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర సంపదపై కన్నేసిన ఆమె తెలంగాణలో విషబీజాలు నాటేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. షర్మిలకు తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని స్పష్టం చేశారు.