![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/Untitled-12-copy-18.jpg)
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలంటూ పలు వేదికల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లే ముందు మరోసారి ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పేద దేశాల ఎదుగుదలకు భారత్ వేదిక లాంటిదని మోడీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లేకుండా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) పరిపూర్ణం కాదని చెప్పారు. ఫ్రాన్స్కు బయల్దేరే ముందు ఫ్రెంచ్ డెయిలీ ‘లెస్ ఎకోస్’తో గురువారం ప్రధాని ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘అత్యధిక జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్.. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం కానప్పుడు ఆ మండలి ప్రపంచం కోసం ఎలా మాట్లాడగలదు? ఐరాస భద్రతా మండలిలో ఎలాంటి మార్పులు జరగాలి? ఇందుకోసం తాము ఎలాంటి పాత్ర పోషించాలి? అన్నదానిపై భారత్ సహా చాలా దేశాలు స్పష్టంగా ఉన్నాయి” అని ఆయన తెలిపారు.