– బాధిత కుటుంబానికి న్యాయం కోసం గ్రామస్తుల పోరాటం
– 30మంది యువకులపై పోలీస్ కేసులు
– అక్రమ కేసులను నిరసిస్తూ గ్రామస్తుల నిరసన దీక్ష
– దీక్షకు సంఘీభావం తెలిపిన మానాల మోహన్ రెడ్డి, ముత్యాల సునీల్ కుమార్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో గత సంవత్సరం గిరిజన యువకుడు మాలావత్ సిద్ధార్థ్ హత్యను నిరసిస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు పోరాటం చేశారు.పోరాడిన 30 మంది గ్రామ యువకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ బుధవారం హస కొత్తూరు గ్రామ ప్రజలు నిరసన దీక్ష చేపట్టారు, ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డితో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హయాంలో బాల్కొండ నియోజకవర్గంలో విష సంస్కృతి పేట్రేగిపోతుందన్నారు. అన్యాయంగా గిరిజన యువకుడు మాలావత్ సిద్ధార్థ్ ను హత్య చేయడమే కాకుండా దానిపై ప్రశ్నించిన గ్రామ యువకులపై కేసులు పెట్టడం హేయమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు.హత్య చేసిన నిందితులపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు, ప్రధాన నిందితుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి అనుచరుడనే కారణంతో నిందితునికి రక్షణ కల్పిస్తూ అమాయకులైన యువకులపై కేసులు నమోదు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి హయంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, దానిపై ఎవరైనా ప్రశ్నిస్తే హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదన్నారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యవసాయం చేసుకునే సామాన్య రైతులపై కూడా కేసులు పెట్టించి వారిని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేసిన వంద రోజులు మాత్రమేనని వారికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.హస కొత్తూర్ గ్రామ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటాన్ని అపకూడదని, ఈ పోరాటంలో బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి పూర్తి అండగా నిలబడుతుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి మాట్లాడుతూ… గిరిజన యువకుడు మాలావత్ సిద్ధార్థ్ హత్యకు కారణమైన నిందితులు మంత్రి ప్రశాంత్ రెడ్డి అండతో భోగాలు అనుభవిస్తుంటే మంత్రి ప్రశాంత్ రెడ్డి అరాచకాలను ప్రశ్నించిన యువకులు అక్రమ కేసుల పాలై పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువకుడ్ని పొట్టన పెట్టుకోవడమే కాకుండా ఆ యువకుడి తండ్రి వైద్యం కోసం ఎల్ఓసి రాకుండా అడ్డుకోవడం మంత్రి ప్రశాంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన మంత్రి వారి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేసి, డబ్బు ఆశ చూపి వారి నోరు మూయించాలని చూస్తున్నారని విమర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసిన గిరిజన యువకుడ్ని హత్య చేసిన కేసులో నిందితులకు శిక్ష పడే వరకు హాస కొత్తూరు గ్రామ ప్రజలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుందన్నారు. ప్రశాంతంగా ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో గంజాయి మత్తులో యువతను ముంచుతున్నారని, గంజాయి మత్తులో బాల్కొండ నియోజకవర్గంలో గతంలో అనేక హత్యలు, దాడులు, అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని వీటన్నిటికీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తో పాటు వారి సోదరుడు కారణమని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తెరపడి గంజాయి బాల్కొండ ప్రజలను వదలాలంటే వేముల ప్రశాంత్ రెడ్డి అనే దుష్టశక్తిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్, బాల్కొండ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేంద్ర, మైనారిటీ సెల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీ, పడిగల ప్రవీణ్, గోపిడి లింగారెడ్డి, కొండేటి శ్రీనివాస్, మహేందర్ గౌడ్, రేవతి గంగాధర్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కూరి దేవేందర్, కస్తూరి శ్రీనివాస్, బుచ్చి మల్లయ్య, ప్రదీప్, శ్రీనివాస్, పడల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.