– ఎరువుల సబ్సిడీ కుదింపుతో రైతాంగానికి నష్టం
– తక్షణమే ఉపసంహరించాలి: ఏఐకేఎస్ డిమాండ్
న్యూఢిల్లీ : గత నెల 26న జారీ చేసిన నోటిఫికేషన్లో ప్రకటించినట్లుగా ఎన్బీఎస్ పథకం కింద ఎరువులపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణనీయంగా తగ్గించింది. రబీ పంట సీజను కోసం దేశవ్యాప్తంగా రైతాంగం సన్నద్ధమవుతున్న కీలక తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. అసలే ఎరువుల సంక్షోభంతో సతమతమవుతుండగా, తాజాగా ఎరువుల సబ్సిడీ కుదింపుతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారే అవకాశం వుంది. ఎరువుల సబ్సిడీ కుదింపుపై అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎరువులు ముఖ్యంగా ఫాస్పేట్, పొటాష్ సబ్సిడీలు దారుణంగా తగ్గించారనీ, దీనివల్ల రైతుల పరిస్థితి మరింత దిగజారుతుందని పేర్కొంది. అంతర్జాతీయంగా ఈ కీలకమైన ఎరువుల ధరలు పెరిగిన సమయంలో ఈ చర్య తీసుకున్నారని విమర్శించింది.
మారకం రేటు యొక్క తరుగుదలను పరిగణనలోకి తీసుకుని లెక్కించేటపుడు, 2020 జూన్లోని సబ్సిడీ రేటుతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరులో ఫాస్పేట్లపై సబ్సిడీ కేవలం 9శాతమే అధికంగా వుందని డేటా వెల్లడిస్తోంది. కానీ 2002 జూన్తో పోలిస్తే రాక్ ఫాస్పేట్ అంతర్జాతీయ ధరలు మాత్రం దాదాపు 4.6 రెట్లు పెరిగాయి. పొటాష్ పరిస్థితి మరీ దారుణంగా వుంది. సబ్సిడీని సంక్షోభానికి ముందు స్థాయిలో కేవలం 23శాతానికి కుదించారు. లేదా మారకపు రేటు తరుగుదలను పరిగణిస్తే దాదాపు 80శాతంగా వుంది. 2020 జూన్తో పోలిస్తే పొటాషియం క్లోరైడ్ అంతర్జాతీయ ధరలు 1.75రెట్లు ఎక్కవగా వున్న తరుణంలో ఈ పరిస్థితి నెలకొందని ఏఐకేఎస్ విమర్శించింది. సబ్సిడీని ఇంత దారుణంగా కుదించడం వల్ల భారత్లో ఎరువుల ధరలు తీవ్రంగా పెరగడానికి దారి తీసే అవకాశం వుందని హెచ్చరించింది. ఎరువుల సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత ప్రభుత్వం తాత్కాలిక రీతిలో, జాప్యందారీ విధానాలతో, ప్రమాదకరమైన పద్దతుల్లో వ్యవహరించడం పట్ల ఎఐకెఎస్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొంటున్న భారత రైతాంగం భవిష్యత్తు తాజా నిర్ణయంతో మరింత అయోమయంగా మారుతోందని పేర్కొంది. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐకేఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రైతుల ఆందోళనలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. దేశ ఆహార భద్రతను పరిరక్షించేందుకు, రైతుల జీవనోపాధులను నిలకడగా కొనసాగించేందుకు అవససరమైన మద్దతు, సబ్సిడీలను అందించాలని కోరింది.