నవతెలంగాణ-హైదరాబాద్ : సంచలనం రేకెత్తించిన ఉపాధ్యాయురాలు (45), రాజేష్ (25) మృతికి సంబంధించి రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. వీరిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. రాజేష్ పోస్టు మార్టం నివేదికలో ఎలాంటి గాయాలు లేవని తేలిందని చెప్పారు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయంపై ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. టీచర్ కుమారుడికి రాజేష్ విషయం తెలిసిందిని దర్యాప్తులో తేలిందని డీఎస్ చౌహాన్ వివరించారు. అతడు ఓసారి రాజేష్ పైన దాడి కూడా చేశాడని చెప్పారు. రాజేష్ ప్రతి రోజు ఉపాధ్యాయురాలు ఇంటి చుట్టూ తిరిగేవాడని దర్యాప్తులో వెల్లడి అయ్యిందన్నారు. టీచర్ మొదటిగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. తన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని ఆమె కుమారుడు రాజేష్కి చెప్పాడని వివరించారు. తాము కలిసి బతకలేమని, ఒకరినొకరు విడిచి ఉండలేమనీ భావించిన వారిద్దరూ.. కలిసే చనిపోవాలని అంతకుముందే నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. ఈ కేసుపై ఇంకా దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.