– ప్రాజెక్టుల్లోకి భారీగా వరద
– ప్రవహిస్తున్న వాగులు
– పిడుగుపాటుకు ముగ్గురు మృతి
– పంటలకు ఆశాజనకం..
– వ్యవసాయ పనులు ముమ్మరం
– చిత్తడిగా రోడ్లు.. నగరాల్లో ఇబ్బందులు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
ఉపరితల ఆవర్తనంతోపాటు ద్రోణి ప్రభావంతో మూడ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొన్ని చోట్ల వ్యవసాయ పనులు ముమ్మరమవ్వగా.. మరికొన్ని చోట్ల పొలాల్లో వరద నిండిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహంతో ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. ప్రాజెక్టుల గేట్లు తెరుచుకున్నాయి. చెరువులు నిండుతుండగా.. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏకధాటిగా వర్షం కురవడం వల్ల రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వర్షంతోపాటు పిడుగులు పడి జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు మృతిచెందారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదే విధంగా నిజాంసాగర్కు ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో 5 గేట్లు ఎతి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు(90.1 టీఎంసీలు) కాగా ప్రస్తుతం అదే స్థాయి నీరు నిల్వ ఉంది.నిజాంసాగర్ ప్రాజెక్టులకు ఎగువ ప్రాంతాల నుంచి 35 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతండగా.. ఐదు గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా.. ప్రస్తుతం 1404.52 అడుగుల మేర నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్ట్ ఏఈ శివ తెలిపారు. మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్
వాతావరణశాఖ ఉమ్మడి కరీం నగర్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరుతోంది. మూలవాగు, మోయ తుమ్మెద వాగు పొంగిపొర్లుతోంది. ఎస్ఆర్ఎస్సీ, కడెం డ్యాం నుంచి పెద్ద ఎత్తున వరద జిల్లాకు చేరు తుండగా.. మధ్యమానేరు, దిగువ మానేరు సహా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్న క్రమంలో మంగళ వారం ఉదయం వరకు సిరిసిల్ల, తంగళ్లపల్లి, వేమువాడ మండలాల్లో 12 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత
దిగువమానేరు డ్యామ్ పూర్తి స్థాయిలో నిండింది. మధ్యమానేరు నుంచి 32వేల క్యూసెక్కులు, మోయ తుమ్మెద వాగు నుంచి 20వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుండ గా.. ఆ ప్రాజెక్టు 6 గేట్లు రెండు ఫీట్ల మేర ఎత్తి దిగువకు 18వేల క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతు న్నారు. ప్రస్తుతం నీటి మట్టం 21 టీఎంసీలు కాగా మరో రెండు టీఎంసీల నీరు వచ్చి చేరితే మరిన్ని గేట్లు తెరుస్తామని అధికారులు పేర్కొన్నారు. మధ్యమానేరు ప్రాజెక్టు లోకి ఎగువ నుంచి, మూలవాగు ద్వారా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 5గేట్లు ఎత్తి దిగువకు ఎల్ఎమ్డికిలోకి నీళ్లు వదులుతు న్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కడెం డ్యాం నుంచి 10415 క్యూసెక్కు లు, ఎస్ఆర్ఎస్పీ నుంచి 85,840 క్యూసెక్కులు, ఇతర వాగులు, వంకల నుంచి మొత్తంగా 2లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి దిగువ మూసీలోకి 3525 క్యూసెక్యుల నీటిని అధికారులు విడు దల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 1055 క్యూసెక్కుల నీరు వచ్చి చేరు తుందని ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 643.60 అడుగుల వద్ద స్థిరంగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి ఉండ టంతో పరిస్థితిని ఎప్పటికికప్పుడూ సమీక్షిస్తున్నామని డీఈఈ చంద్రశేఖర్ ఏఈఈ ఉదరు కుమార్ మమత చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రుద్రవెల్లి మూసీ బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహి స్తోంది. వరద ప్రభావం భారీగా ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు బీబీనగర్ – పోచంపల్లి వెళ్లే రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. బ్రిడ్జి రెండు వైపులా ముళ్ళకంచె, భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద లక్షల కూసెక్యుల నీరు ప్రవహిస్తోంది.
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
చిట్యాలలో ఇద్దరు మహిళా కూలీలు, కాటారంలో ఒకరు
నవతెలంగాణ-చిట్యాల
పిడుగుపాటుకు జయశంకర్-భూపా లపల్లి జిల్లాలో ముగ్గురు ప్రాణం కోల్పో యారు. మరో నలుగురికి గాయాలయ్యా యి. వివరాల్లోకెళ్తే చిట్యాల మండల కేంద్రం రాంనగర్ కాలనీకి చెందిన చిలువేరు సరిత(40), నేర్పాటి మమత(30) మరి కొంత మంది కూలీలు ఓ రైతు పొలంలో మిరప నారు నాటేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఉరుములతో కూడిన వర్షం పడటంతో కూలీలంతా సమీపంలోని చెట్టు కిందకు వెళ్లగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో చిలువేరు సరిత, నేర్పాటి మమత అక్కడికక్కడే మృతిచెందారు. పర్లపల్లి భద్రమ్మ, ఆరేపల్లి కొమరమ్మ, మైదం ఉమ, శివకు తీవ్రగాయాలయ్యాయి. వారిని మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి. అలాగే, కాటారం మండ లం దామరకుంట గ్రామానికి చెందిన కౌలు రైతు గూడూరి రాజేశ్వర రావు(46) వరి పొలంలో కలుపు తీస్తుండగా పిడుగుపాటుకు అక్కడిక క్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.