నవతెలంగాణ హైదరాబాద్: బ్యాంకులు, న్యాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వద్ద అప్పులు చేసి ఆ తర్వాత దివాలా తీసిన వారికి ఆర్బీఐ కొంత ఊరటనిచ్చింది. ‘‘జరిమానా వడ్డీ లేదా ఛార్జీలను కేవలం రుణ గ్రహీతల్లో క్రమశిక్షణ పెంచడానికి మాత్రమే వినియోగించాలి. అంతేకానీ, అటువంటి వాటిని ముందుగా చేసుకొన్న ఒప్పందం రేటు కంటే మించి ఆదాయం పెంచుకొనే సాధనాలుగా వాడకూడదు. ఈ సంస్థలు విధించే అత్యధిక వడ్డీరేట్లు.. వివాదాలు, ఫిర్యాదులకు దారి తీస్తున్నాయి’’ అని ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొంది. రుణగ్రహీతలు చెల్లించలేని సమయంలో చాలా సంస్థలు ఉన్న నిబంధనలు ఆసరాగా చేసుకొని జరిమానా వడ్డీ రేట్లను సాధారణంగా కంటే అధికంగా వసూలు చేస్తున్నట్టు తాము గుర్తించామని పేర్కొంది. ఆర్బీఐ పరిధిలో పనిచేసే వాణిజ్య బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర రుణదాతలు లేదా రెగ్యులేటేడ్ సంస్థలు (ఆర్ఈ) జరిమానా రూపంలో వసూలు చేసే వడ్డీ విషయంలో సహేతుకంగా, పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేసింది.
- నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయలేకపోతే జరిమానాను ఛార్జీల రూపంలో మాత్రమే విధించాలి. అంతేకానీ, జరిమానా వడ్డీ ఛార్జీలను విధించకూడదు.
- దీనిని ఆదాయ మార్గంగా మార్చుకోకూడదు. అంతేకాదు.. ఈ ఛార్జీలపై భవిష్యత్తులో ఎలాంటి వడ్డీని విధించకూడదు.
- ఇది సాధారణ రుణాలపై విధించే చక్రవడ్డీకి వర్తించదని ఆర్బీఐ పేర్కొంది.
- బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వడ్డీకి మరే ఇతర అదనపు భారాలను జోడించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
- ఆర్బీఐ పరిధిలోని సంస్థలు జరిమానా వడ్డీ తదితర ఛార్జీల విధానాలను తయారు చేసి ఆమోదించేందుకు ఓ బోర్డు ఏర్పడనుంది.
- ఆ బోర్డుమంజూరు చేసిన రుణాల నిబంధన పరిధిలో జరిమానా ఛార్జీలు సహేతుకంగా ఉండేలా చూడనుంది.
- వ్యక్తిగత, వ్యాపారేతర రుణాలపై విధించే అపరాధ రుసుములు వ్యక్తిగతేతర రుణాలపై విధించే పీనల్ ఛార్జీల కంటే తక్కువగా ఉండాలి.
- తాజాగా ఆయా సంస్థలు తాము రుణాలు మంజూరు చేసే సమయంలో అపరాధ రుసుముల స్పష్టంగా వెల్లడించాలని ఆర్బీఐ చెబుతోంది.
- ఆయా సంస్థలు తమ వెబ్సైట్లలో వీటిని వడ్డీరేట్లు, సర్వీసు ఛార్జీల విభాగాల్లో ప్రదర్శించాలని చెబుతోంది.
- రుణ చెల్లింపుల్లు చేయని పక్షంలో రుణగ్రహీతలకు రిమైండర్లు పంపాల్సి ఉంటుంది.
- చెల్లింపులు చేయకపోతే విధించబోయే పీనల్ ఛార్జీలను ముందుగానే రుణగ్రహీతలకు తెలియజేయాల్సి ఉంటుంది.
- అపరాధ రుసుం విధించిన సందర్భం, కారణం కూడా వివరించాలి. ఈ నిబంధనలు మొత్తం 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ మార్గదర్శకాల స్ఫూర్తిని అర్థం చేసుకొని పాటించాలని పేర్కొంది.