– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
నవతెలంగాణ-చేర్యాల
మతతత్వ పార్టీలకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలని సీపీిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ అన్నారు. సీపీఐ(ఎం) జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డికి మద్దతుగా పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డితో కలిసి గురువారం చేర్యాల మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో అబ్బాస్ మాట్లాడుతూ.. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉందో కండ్లకు అద్దం పడుతుందన్నారు. అసెంబ్లీలో ఒకరిపై ఒకరు పొగడ్తలు, వ్యక్తిగత విమర్శలు తప్ప ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చలూ జరపడం లేదన్నారు. ప్రజా సమస్యలపై చర్చలు జరగాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు దాసరి కళావతి, రాళ్ల బండి శశిధర్, కాముని గోపాలస్వామి, బూడిద గోపి, కొంగరి వెంకట మావో, అత్తిని శారద, బండి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.