నవతెలంగాణ- కరీంనగర్: తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఇప్పుడు ఆ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విజయభేరి బస్సు యాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ములుగు జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర భూపాలపల్లికి చేరుకుంది. ఈ క్రమంలోనే భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. తాము అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్నారు. ఒక్క అధికారిని సీఎండీగా ఇంతకాలం ఎందుకు కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ ప్రశ్నించారు. గనుల బిల్లుకు పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్దతు తెలపలేదా? అని ప్రశ్నించారు. సింగరేణి లాభాల్లో ఉండాలంటే మంచి యాజమాన్యం ఉండాలని తెలిపారు.