నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లో అధిక ఉష్ణోగ్రతలకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత మూడు రోజుల్లోనే వడదెబ్బ కారణంగా అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క బలియా జిల్లాలోనే గడిచిన 24 గంటల వ్యవధిలో 34 మంది చనిపోవడం కలవరపెడుతోంది. మరోవైపు బిహార్లోనూ 44 మంది వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. యూపీలోని అనేక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా బలియా జిల్లాలో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంది. మూడు రోజులుగా వడదెబ్బ కారణంగా ఇక్కడ 400 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇప్పటివరకు 54 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ 15న 23 మంది, మరుసటి రోజు 20 మంది, తాజాగా 11 మంది ప్రాణాలు కోల్పోయారని బలియా జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే, వారి మరణానికి అనేక అంశాలు కారణమని.. అందులో వడదెబ్బ కూడా ఒకటి అని చెప్పారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితోపాటు ఇతర కారణాలతో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారని.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, డయేరియాలతో చనిపోతున్నారని తెలిపారు.