
- ప్రారంభించిన గవర్నర్
నవతెలంగాణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి విశిష్ఠ సేవలందించిన మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మరో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. 4వ తరానికి చెందిన డా విన్సీ × రోబోను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ రోబోను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గురువారం ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మణిపాల్ ఎంటర్పైజెస్ ఛైర్మన్ డా. సుదర్శన్ బల్లాల్, మణిపాల్ హాస్పటిల్ విజయవాడ డైరెక్టర్ సుధాకర్ కంటిపూడి ఇతర ప్రముఖలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ వైద్యరంగంలో మరోకొత్త చరిత్రకు మణపాల్ హాస్పిటల్ తెరతీసిందని చెప్పారు. రొబోటిక్ అసిస్టెడ్ సర్జరీ తో ఆంధ్రప్రదేశ్ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అందుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్స్ వారు ప్రవేశపెట్టిన ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడ్వాన్స్ మెంట్ అనేది ఏపీ ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ఒక గొప్ప ముందడుగు అని స్పష్టం చేశారు. రోబోటిక్ సర్జరీతో రోగులకు కచితత్వం ఉంటుందని అన్నారు. దీంతో రోగులు త్వరగా కోలుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణతో శస్త్రచికిత్సా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి సాంకేతిక ఆవిష్కరణలతో భారతదేశ వైద్య చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
డా.సుదర్శన్ బల్లాల్ – ఛైర్మన్, మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా వివిధ వైద్య విభాగాలకు రోబోటిక్ సర్జరీస్ ను పరిచయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డా. సుధాకర్ కంటిపూడి హాస్పిటల్ డైరెక్టర్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ మాట్లాడుతూ విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వైద్యరంగంలో అత్యాధునిక వైద్య సాంకేతికతను ముందుకు తీసుకురావలన్నదే మణిపాల్ హాస్పిటల్ విజయవాడ లక్ష్యమని తెలిపారు. అత్యంత నైపుణ్యతగల సర్జన్స్, పోస్ట్ ఆపరేటివ్, రీ హాబ్ కేర్ నిపుణుల బృందంతో అత్యున్నత ప్రమాణాల వైద్యసేవలను అందించడానికి తాము అంకితభావంతో ఉన్నామని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఎల్లప్పుడు రోగులకు అత్యుత్తమ వైద్య సేవలను అందించడానికి సంసిద్ధతతో ఉందని తెలిపారు.
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ రొబోటిక్ నిపుణులు డా. సురేంద్ర జాస్తి, డా. వి. ధర్మేంద్ర కుమార్, డా. రవి శంకర్ గంజి, డా. లక్ష్మీ ప్రసూణ మాట్లాడుతూ శస్త్రచికిత్సా విధానంలో ఆధునిక రొబోటిక్ సాంకేతికతను జతచేయడంతో ఈ ప్రాంతంలోని ఆరోగ్య సంరక్షణ సరిక్రొత్తగా నిర్వహించబడుతుందని, ఈ మార్పులో తాము భాగస్వాములవుతున్నట్టు తెలిపారు. ఈ విప్లవాత్మకమైన విధానం అనితరసాధ్యమైన ఖచ్చితత్వం, మెరుగైన ఫలితాలు, శస్త్రచికిత్సానంతరం వేగవంతంగా కోలుకోవడం వంటి వాటిని రోగులకు అందివ్వడానికి తమకు తోడ్పడుతుందని తెలిపారు.