నవతెలంగాణ-హైదరాబాద్: వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ విలవిలలాడిందని.. దెబ్బతిన్న రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. ‘‘యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట్లు చెబుతుంటారు. ప్రపంచ దేశాల సంగతేమో గానీ నగర ప్రజలే బయటకు రావడానికి ఒకటికి పది సార్లు ఆలోచించే దుస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో ఎక్కడ గుంత ఉందో?ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో? అని ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రజలు తిరిగాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్భాలు పలికారు. గత 9 ఏళ్లుగా నగరంలో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే దిశగా ఒక్క చర్య చేపట్టలేదు. హైదరాబాద్లో ఇంత విధ్వంసం జరుగుతుంటే కనీసం సమీక్ష చేసే సమయం మంత్రిగా మీకు లేదా?వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. అయినా ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు’’ అని రేవంత్ లేఖలో దుయ్యబట్టారు.