నవతెలంగాణ – హర్యానా
తన బ్యాంకు ఖాతాలో రూ.200 కోట్లు నగదు జమ అయ్యిందని తెలిసి ఓ పేద రైతుకు దిమ్మతిరిగినంత పనైంది. హర్యానాలోని చక్రీదాద్రీ జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. జిల్లాకు చెందిన విక్రమ్ వ్యవసాయం చేస్తుంటాడు. గురువారం అతడు తన ఖాతాలో డబ్బు ఎంత ఉందో చూసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. అయితే, అతడి ఖాతాలో రూ.200 కోట్లు జమ అయ్యాయని బ్యాంకు వారు చెప్పడంతో అతడు షాకయిపోయాడు. చివరకు విక్రమ్ కొందరు గ్రామస్థులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. బ్యాంకు అధికారులను అడిగి పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ చేశాకే అసలేం జరిగిందో, రూ.200 కోట్లు విక్రమ్ ఖాతాలోకి ఎలా వచ్చాయో చెబుతామని జిల్లా ఏఎస్పీ పేర్కొన్నారు.