నవతెలంగాణ-హైదరాబాద్ : ఓడిశాలో టమాటా వ్యాపారిని ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. తనతో వచ్చిన ఇద్దరు పిల్లలను షాపు దగ్గర కూచోబెట్టి నాలుగు కిలోల టమాటాలతో పరారయ్యాడు. కటక్లోని ఛత్రబజార్ ఏరియాలో ఉన్న ఓ కూరగాయల దుకాణంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి నాలుగు కిలోల టమాటాలు తీసుకున్నాడు. మరో పది కిలోలు కూడా కావాలని చెప్పాడు. ఆపై బ్యాగు తీసుకొస్తానని, అప్పటి వరకు తన పిల్లలు ఇక్కడే ఉంటారని నాలుగు కిలోల టమాటాలతో వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ ఆ వ్యక్తి తిరిగి రాకపోవడంతో వ్యాపారి అనుమానించాడు. పిల్లలను విచారించడంతో తన అనుమానం నిజమేనని నిర్ధారణ అయింది. తమను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో అసలు తమకు తెలియదని ఆ పిల్లలు చెప్పారు. పని ఇప్పిస్తానని, చెరో రూ.300 ఇస్తానని చెప్పడంతో ఆయనతో కలిసి వచ్చామని వివరించారు. తమను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్లిపోయాడని చిన్నారులు బోరుమన్నారు.