నవతెలంగాణ హైదరాబాద్: తన భర్తపై ఏఎస్సై నర్సింగ్రావు, కానిస్టేబుల్ చందు పెట్రోల్ పోసి తగులబెట్టారని హోంగార్డు రవీందర్ భార్య సంధ్య ఆరోపించారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. రవీందర్ ఫోన్ను అన్లాక్ చేసి డేటా డిలీట్ చేశారని.. ఇప్పటి వరకూ వాళ్లిద్దరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదని సంధ్య నిలదీశారు. తన భర్తతో తాను మాట్లాడిన తర్వాతే చంపేశారని ఆమె ఆరోపించారు. 17 ఏండ్లుగా నిబద్ధతతో విధులు నిర్వర్తించిన తన భర్త మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రవీందర్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ముమ్మాటికి అతడిది హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సంధ్యతో పాటు కుటుంబసభ్యులు ఉదయం 9 గంటల నుంచి ఉస్మానియా ఆస్పత్రి ఓపీ విభాగం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఆమెకు మరికొందరు హోంగార్డులు మద్దతు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సంధ్యతో చర్చించారు. ఉస్మానియాలో అత్యవసర వైద్య సేవలకు వచ్చేవారికి ఇబ్బంది ఎదురవుతోందని.. ఆందోళన విరమించాలని సీఐ కోరినా ఆమె వెనక్కి తగ్గలేదు. సీసీ ఫుటేజీ బయటపెట్టే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పారు.