నవతెలంగాణ – హైదరాబాద్
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో అధిక ఉష్ణోగ్రత, వడగాలులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్..తదితర రాష్ర్టాల్లో వడగాలులకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు రోజుల్లో యూపీలోని ఒక్క బాలియా జిల్లాలో 400మంది దవాఖాన పాలయ్యారు. 54మంది చనిపోయారని అధికారిక సమాచారం వెలువడింది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, డయేరియాతో చనిపోయారని బాలియా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోలేకపోవటం..ఇతర అనారోగ్య సమస్యలతో వందలాది మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాగల మూడు రోజులపాటు 10 రాష్ర్టాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతున్నదని వెల్లడించింది. వడగాడ్పుల నేపథ్యంలో బీహార్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. జార్ఖండ్లో జూన్ 27 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గోవా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోనూ ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని సెలవులను పొడగించారు. రాబోయే రోజుల్లో ఈశాన్య రాష్ర్టాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.