నవతెలంగాణ- చండూరు: కథలు విద్యార్థులలో విలువలను పెంపొందింప చేయడమే కాకుండా వారి జీవితాలను తీర్చి దిద్దుతాయని ప్రధానోపాధ్యాయులు ఎడ్ల బిక్షం అన్నారు. మంగళవారం చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాల సాహితీ వేత్త ఆంగ్ల ఉపాధ్యాయుడు బుచ్చిరెడ్డి రాసిన బంతిపూలు బాలల కథలను పిల్లలచే ఆవిష్కరింపజేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండే ఇటువంటి కథలను చదవడం వల్ల విద్యార్థులలో క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. రచయిత బుచ్చిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో మంచి ప్రవర్తన కలిగిన పౌరులుగా ఎదిగేందుకు కథలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రతిరోజు గ్రంథాలయం పీరియడ్ లో విద్యార్థులు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని కోరారు. బంతి పూల కథలను ఆవిష్కరించిన విద్యార్థులు మాట్లాడుతూ మా చేతుల మీదుగా ఆవిష్కరించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేమని తెలియజేశారు. పుస్తకంలోని కథలను తెలుగు ఉపాధ్యాయురాలు జి. అలివేలు సమీక్ష చేస్తూ బుచ్చిరెడ్డి సార్ రాసిన బంతిపూల కథలు చాలా బాగున్నాయని ప్రతి కథకు ఆకర్షనీయమైన బొమ్మలు ఉన్నాయని పేర్కొంది. బడిలో బలగం, అమ్మ కోసం, నక్క మోసం, తన్నులు తిన్న పులి, గురువు పరీక్ష వంటి మొత్తం 21 కథలు ఉన్నాయని తెలిపింది. ఈ కార్యక్రమంలో మమత, వాసంతి, సైదులు, వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి , నరసింహారావు నాగ శ్రీ ,విజయలక్ష్మి, భార్గవి,సోఫియా, సరిత, యాదయ్య, లియాకత్ అలీ, సుధాకర్ రెడ్డి, సునీత, శైలజ, రేణుక, డాన్స్ మాస్టర్ స్వామి తదితర ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.