నవతెలంగాణ-యైటింక్లయిన్ కాలనీ: గణేష్ ఊరేగింపులలో డీజేలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని టూ టౌన్ సీఐ సూరం వేణుగోపాల్ గణేష్ మండప నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో రంగులు చల్లడం, లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం, బాణాసంచా పేల్చడం చేయరాదని,పందిళ్ళ వద్ద ఊరేగింపు సమయాలలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నాట్య ప్రదర్శనలు జరగకుండా మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు లేకుండా ఉండే విధంగా ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలని అన్నారు.విగ్రహ ఊరేగింపు సమయంలో భారీ వాహనాలు పెట్టరాదని నిమజ్జన ఊరేగింపునకు అనుమతించిన సమయం, రూటు కచ్చితంగా పాటించాలన్నారు.ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు భద్రత కోసం తగినంత మంది వాలంటీర్లను ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అర్జీదారుడు కార్యనిర్వాహకులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన సూచించారు.