– ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి
నవ తెలంగాణ- ఆర్మూర్: విద్యార్థులకు బాధ్యత పట్ల చక్కటి అవగాహన కల్పించాలని బాధ్యతలను నిర్వర్తించే విధానాలను తెలియపరచాలని తద్వారా సమాజంలో ఉత్తములుగా ఉండవచ్చని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని బ్రాహ్మణపల్లి క్రాస్ రోడ్స్ వద్ద గల పాఠశాల ప్రాంగణంలో గురువారం వివిధ విభాగాల క్యాప్టెన్సు, వైస్ కెప్టెన్సు ప్రమాణ స్వీకరణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో ఇటీవల కాలంలో ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించటం జరిగినదని, ప్రజాస్వామ్య దేశంలో ఓట్లు చాలా కీలకంగా వ్యవహరిస్తాయని, నాయకుల భవితవ్యాన్ని తేల్చి చెప్పేది ఎన్నిక అని చెప్పారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం ఎన్నికలు నిర్వహించటం జరుగుతుందని, ఈ సంవత్సరం సైతం రెట్టింపైన ఉత్సాహంతో పాఠశాలలలోని వివిధ విభాగాల క్యాప్టెన్సు, వైస్ కెప్టెన్లకు ఎన్నికలు ఎన్నికల వాతావరణం కల్పించే విధంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాఠశాలలోని తేజస్, సరీస్, ధ్రువ, లక్ష విభాగాల బాలబాలికలకు వేరువేరుగా ఎన్నికల పోటీలను నిర్వహించడం జరిగిందని, ప్రమాణ స్వీకరణ ఉత్సవాలలో భాగంగా విద్యార్థులచే బాధ్యతలను పాఠశాలలకు అనుగుణంగా తోటి విద్యార్థులలో సోదర భావం పెంపొందించే విధంగా స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి, ఆదర్శంగా విధులను నిర్వర్తిస్తామని విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార అనంతరం తోటి విద్యార్థులు ఎన్నికైన వారికి శుభాభినందనల తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.