నవతెలంగాణ – బెంగళూరు
తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఐదు కన్నడ అనుకూల సంస్థలు చేపట్టిన బంద్ కర్ణాటకలో కొనసాగుతోంది. బంద్ సందర్భంగా బెంగళూరులో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా, ప్రైవేటు సంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ట్యాక్సీలు, ఆటోలు రోడ్డెక్కకపోవడంతో ప్రజా రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఈ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలోనూ గందరగోళం చెలరేగింది. ఎయిర్పోర్టులో నిరసన తెలిపేందుకు కర్ణాటక జెండాలతో వచ్చిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు వీరు టికెట్లు బుక్ చేసుకుని మరీ రావడం గమనార్హం. మరోవైపు, బెంగళూరు ఎయిర్పోర్టు అధికారులు 44 విమానాలను రద్దు చేశారు. బంద్ సందర్బంగా చాలామంది ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. విమానాలు రద్దయిన విషయాన్ని ప్రయాణికులకు చేరవేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ బంద్కు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ మద్దతు తెలిపాయి.