నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై ఓ బీరు వ్యాన్ బోల్తా పడింది. 200 బీరు కేసులతో వెళుతున్న ఈ వ్యాన్ కశింకోట మండలం బయ్యవరం వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడడంతో అందులోని బీరు కేసులన్నీ రోడ్డు పాలయ్యాయి. బీరు వ్యాన్ రోడ్డుపై తిరగబడిందన్న సమాచారం కొన్ని నిమిషాల్లోనే పాకిపోయింది. మందుబాబులు హుటాహుటీన అక్కడికి చేరుకుని అందిన కాడికి బీరు సీసాలు ఎత్తుకెళ్లారు. రోడ్డుపై పడడంతో కొన్ని బీరు సీసాలు పగిలిపోగా, మిగిలిన వాటికోసం మద్యం ప్రియులు పోటీపడ్డారు. వ్యాన్ బోల్తా నేపథ్యంలో ఆ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోగా, ప్రయాణికులు కూడా చేతికి అందినన్ని బీరు సీసాలు పట్టుకెళ్లారు. వ్యాన్ బోల్తాపడిన ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు.