నవతెలంగాణ-హైదరాబాద్ : కన్నబిడ్డలను కాపాడాల్సిన తండ్రే వారి పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. పసిపిల్లలను వరుసలో నిలబెట్టి కాల్చి చంపాడు. వారు పారిపోతుంటే వెంటాడి తీసుకొచ్చి మరీ ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అమెరికాలోని ఒహైయోలో గత గురువారం జరిగిందీ దారుణ ఘటన. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒహైయోలోని క్లెర్మాంట్ కౌంటీకి చెందిన 32 ఏళ్ల చాడ్ డోరేమన్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత గురువారం చాడ్ తన భార్యా పిల్లలపై దాడికి పాల్పడ్డాడు. అందర్నీ తన ఇంటి వెనుకున్న పెరట్లోకి తీసుకెళ్లాడు. మూడు, నాలుగు, ఏడేళ్ల వయసున్న తన ముగ్గురు కుమారులు, కుమార్తెను వరుసలో నిల్చోబెట్టాడు. ఏం జరుగుతుందో ఊహించేలోపే వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపైనా దాడి చేశాడు. వీరిలో ఓ కుమారుడు తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పొరుగింటివైపు పరిగెత్తాడు. కానీ చాడ్ ఆ బాలుడినీ వెంటాడి పట్టుకున్నాడు. మళ్లీ పెరట్లోకి తీసుకొచ్చి వరుసలో నిల్చోబెట్టి కాల్చి చంపాడు. తండ్రి దాడి నుంచి కుమార్తె తప్పించుకుంది. అరుస్తూ వీధిలోకి పరుగులు తీసింది. ఆమె అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అటు బుల్లెట్ గాయంతో బాధపడుతూ చాడ్ భార్య కూడా 911 నంబరుకు ఫోన్ చేసింది. వెంటనే పోలీసులు చాడ్ ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ ముగ్గురు కుమారులు మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన చా
డ్ భార్యను ఆస్పత్రికి తరలించారు. అతడి కుమార్తెను కూడా కాపాడారు. పోలీసులు వెళ్లే సరికి చాడ్ తన ఇంటి ముందు కూర్చుని కన్పించాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. తన పిల్లలను వరుసలో నిల్చోబెట్టి తానే హత్య చేసినట్లు చాడ్ విచారణలో అంగీకరించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందుకోసం కొన్ని నెలల నుంచి ప్రణాళిక రచిస్తున్నట్లు అతడు చెప్పాడట. అయితే హత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని అధికారులు తెలిపారు.