నవతెలంగాణ-ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో దారుణం.. ఓ మహిళ కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా కడతేర్చిన ఘటన వెలుగుచూసింది. డులారో దేవీ అనే మహిళ నిద్రిస్తున్న తన భర్త రామ్ పాల్ను (56) గొడ్డలితో నరికి చంపింది. అనంతరం మృతదేహాన్ని మంచానికి కట్టేసి 5 ముక్కలుగా ఖండించిది. ఆ శరీర భాగాలను తీసుకెళ్లి దగ్గరలోని ఓ కాలువలో విసిరేసింది. అనంతరం పెద్ద డ్రామాకు తెరలేపింది. భర్త కనిపించడం లేదంటూ ప్రచారం మొదలుపెట్టింది. తాము నివసించే ప్రాంతానికి దగ్గరలోనే భార్య, పిల్లలతో నివసించే కొడుకుని కూడా ఇలాగే బురికొట్టించింది. అయితే.. తండ్రి కనిపించడం లేదంటూ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. భార్య డులారో దేవీ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆమెను పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేకపోవడంతో చివరికి తానే హత్య చేసినట్టు నిందితురాలు అంగీకరించింది. భర్తను హత్య చేసిన విధానాన్ని పోలీసులకు వివరించింది. ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా శరీర భాగాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈతగాళ్ల సాయం తీసుకున్నట్టు చెప్పారు. రక్తపు మరకలున్న దుస్తులు, ఒక పరుపును గుర్తించామని, శరీర భాగాల కోసం కాలువలో అన్వేషిస్తున్నట్టు వివరించారు. హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు తదుపరి దర్యాప్తు చేపట్టనున్నట్టు వివరించారు.