నవతెలంగాణ – అదిలాబాద్: తృటిలో పెను ప్రమాదం తప్పింది. బెల్లంపల్లి-మందమర్రి రైల్వే స్టేషన్ల మధ్య విద్యుత్ తీగ తెగిపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఓవర్హెడ్ ఎలక్ట్రిక్ తీగ తెగినట్టు రైల్వే సిబ్బంది గుర్తించారు. మహబూబ్నగర్కు వెళ్లే రైలు మందమర్రికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా రైలు ఇంజిన్కు విద్యుత్ తీగలు తగలడంతో తెగిపడ్డాయి. దీంతో కాజీపేట వైపునకు వెళ్తున్న కుచువెల్లి-కోర్బా ఎక్స్ప్రెస్ రైలును 3.10గంటలకు బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. దిల్లీ వెళ్తున్న రాజధాని రైలు 45 నిమిషాల పాటు నిలిచిపోయింది. విద్యుత్లైన్ మరమ్మతు పనులను సిబ్బంది సాయంత్రం 5గంటలకు పూర్తి చేశారు. కోర్బా ఎక్స్ప్రెస్ రైలు సాయంత్రం 6గంటలకు యధావిధిగా బయలుదేరగా, రాజధాని ఎక్స్ప్రెస్ 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. కోర్బా ఎక్స్ప్రెస్ దాదాపు 3గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మరో వైపు కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ కోసం వచ్చిన ప్రయాణికులు నాలుగు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. దానాపూర్, అండమాన్, ఏపీసీపీ, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సాయంత్రం 6గంటల సమయంలో అన్ని రైళ్లు పట్టాలెక్కాయని రైల్వే అధికారులు తెలిపారు.