నవతెలంగాణ – హైదరాబాద్: నంద్యాల గాంధీ నగర్లో దారుణం జరిగింది. 19 రోజుల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. మూడేళ్ల క్రితం స్థానిక యువకుడు మహేష్ షన్ను అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు నంద్యాలలోని గాంధీ నగర్లో నివాసం ఉంటున్నారు. గతేడాది షన్ను ఆడ శిశువుకు జన్మనివ్వగా క్షణాల్లో ప్రాణం కోల్పోయింది. 19 రోజుల క్రితం షన్ను మగ పిల్లాడికి జన్మనిచ్చింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఈరోజు చిన్నారి రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. పక్కనే అపస్మారక స్థితిలో ఉన్న షన్నును ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతి చెందిన పరిస్థితి.. తల్లి పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లే మతిస్థిమితం కోల్పోయి కొడుకును చంపినట్లు బంధువులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న అత్తమామలు, భర్త బయటకు వెళ్లిన సమయంలో కన్న కొడుకును తల్లి విచక్షణారహితంగా గొంతు కొరికి చంపిందని.. ఎలాంటి కారణాలు లేకుండా ఇంతటి దారుణానికి పాల్పడినట్లు చిన్నారి తాత చెబుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. పసికందు మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.