తెలంగాణకు మూడు అవార్డులు

– జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవం
– ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న జగన్నాధపురం సర్పంచ్‌
– ఉత్తమ రాష్ట్రంగా ఏపీకి మూడో స్థానం
న్యూఢిల్లీ : జాతీయ నీటి అవార్డుల్లో భాగంగా తెలంగాణకు మూడు అవార్డులు లభించాయి. ఇటు ఉత్తమ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ కి మూడో స్థానం లభించింది. శనివారం నాడిక్కడ విజ్ఞాన్‌ భవన్‌ లో 4వ జాతీయ నీటి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ అవార్డులను భారత ఉప రాష్ట్రపతి జగదీప్‌ దన్‌ ఖర్‌ ప్రదానం చేశారు. ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ మొదటి బహుమతి అందుకుంది. రెండో స్థానంలో ఒడిశా, మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. 11 విభాగాల్లో పురస్కారాల ఇచ్చారు. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, సహాయ మంత్రులు బిశ్వేశ్వర్‌ తుడు, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌లు ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఉత్తమ జిల్లాల్లో తెలంగాణాలోని ఆదిలాబాద్‌ జిల్లాకు మూడో స్థానం లభించింది. గ్రామ పంచాయతీ కేటగిరీలో దేశంలో ఉత్తమ గ్రామ పంచాయితీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామానికి అవార్డ్‌ దక్కింది. నీటి విధా నాలను అవలంభించడం ప్రజల్లో అవగాహన కల్పించినందుకు భద్రాది కొత్త గూడెం జిల్లా జగన్నాధపురం గ్రామంకు అవార్డు వరించింది. ఉపరాష్ట్రపతి జగ దీప్‌ ధనకడ్‌ చేతుల మీదగా జగన్నాధపురం సర్పంచ్‌ గడ్డం భవాని, పంచాయితీ కార్యదర్శి షేక్‌ ఇబ్రహీం ఈ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీకి రెండో అవార్డ్‌ దక్కింది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తరఫున జలవనరుల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ పాఠశాల విభాగంలో నంద్యాల జిల్లా చాగలమర్రిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం రెండో స్థానం, ఉత్తమ పరిశ్రమల విభాగంలో తిరుపతికి చెందిన సీసీఎల్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ మూడో స్థానం పొంది పురస్కారాలు అందుకున్నాయి. ఉత్తమ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల విభాగంలో అనంతపురములోని ఆక్టా ఫ్రెటర్నా ఏకొలజీ సెంటర్‌కు స్పెషల్‌ కన్సోలేషన్‌ ప్రైజ్‌ లభించింది.