నవతెలంగాణ న్యూఢిల్లీ: గుజరాత్లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జి కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. బనస్కాంత జిల్లా పాలన్పుర్లో సోమవారం ఈ ఘటన జరిగింది. పాలన్పుర్-అంబాజీని కలిపేందుకు నిర్మిస్తున్న ఈ వంతెన కోసం వారం క్రితమే ఆరు కాంక్రీటు స్లాబులు నిర్మించారు. సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆటోలో వంతెన కింది నుంచి వస్తూ శబ్దాలు రావడంతో స్లాబులు పడిపోవడం గమనించాడు. ‘బతుకు జీవుడా అంటూ`… ఆటోను వదిలి పరుగు లంకించాడు. అయినా దురదుష్టం వెంటాడి అతడు శిథిలాల కింద నలిగిపోయి, ప్రాణాలు విడిచాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. శిథిలాల కింద చిక్కుకొని మరొ ఇద్దరు కూడా మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల వేసిన స్లాబులు కూలిపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్టు బనస్కాంత జిల్లా కలెక్టర్ వరుణ్కుమార్ బరన్వాల్ తెలిపారు. కాగా, ఏడాది క్రితం ఇదే అక్టోబర్లో ఇదే గుజరాత్లో మోర్బీలో వంతెన కూలిన ఘటనలో 135 మంది మరణించడం తెలిసిందే. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ పని తీరు.