నవతెలంగాణ-హైదరాబాద్ : ఏలూరు యాసిడ్ దాడి బాధితురాలు ఎడ్ల ఫ్రాన్సిక (35) మృతిచెందింది. గత మంగళవారం ఏలూరులో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో ఫ్రాన్సిక చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది. ఏలూరులోని జెవియర్ నగర్లో నివాసముంటున్న ఎడ్ల ఫ్రాన్సిక దుగ్గిరాల సమీపంలోని దంత వైద్య కళాశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నారు. ఈమె భర్త రాజమహేంద్రవరంలో కెమికల్ ఇంజినీరు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. విభేదాలు రావడంతో రెండేళ్లుగా భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. గత మంగళవారం రాత్రి విధులకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఇంటికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్తో దాడి చేశారు. ఆమె తల, ముఖానికి గాయాలయ్యాయి. ఆమె పరుగులు తీస్తూ ఇంటికి రాగా కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తొలుత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఫ్రాన్సిక అక్కడ చికిత్స పొందుతూ నేడు చనిపోయింది.