నవతెలంగాణ – హనుమకొండ: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కమలాపూర్ మండలం మర్పెల్లిగూడెంలో విద్యార్థులతో ర్యాలీ తీస్తుండగా ట్రాక్టర్ కింద పడి 6వ తరగతి విద్యార్థి ఇనుగాల ధనుష్(10) దుర్మరణం చెందాడు. ర్యాలీ తీస్తుండగా కిరాణం దుకాణంలోకి వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంటుండగా వెంటపడ్డ కుక్కలను తప్పించుకునే ప్రయత్నంలో విద్యార్థి ట్రాక్టర్ కింద పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక పాఠశాలలో 5 వ తరగతి పూర్తి చేసిన ధనుష్… ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశం కోసం హైస్కూల్కు వెళ్లాడు. ఇంతలోనే విద్యా పండుగ వేడుకల్లో భాగంగా ర్యాలీ తీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో హుషారుగా స్కూలుకు వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు జయపాల్, స్వప్న కన్నీరుమున్నీరుగా విలిపస్తున్నారు. పాఠశాల నిర్వహకుల నిర్లక్ష్యమే విద్యార్థుల ప్రాణం తీసిందని గ్రామస్తులు అంటున్నారు. పాఠశాల నిర్వాహకులు, అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.